Saturday, January 10, 2009

భారతజాతి బలహీనత

మెతకతనాన్ని ధర్మంగా, భగవంతునికి ప్రీతిపాత్రమైన చర్యగా భావించటం భారతదేశపు జాతీయ మనస్తత్వంలో అనాదిగా కొనసాగుతున ఒక బలహీనత. ధర్మభావన ఎడల సరైన అవగాహన లేకుండా, ధర్మసూక్ష్మాన్ని గ్రహించే ప్రయత్నం చేయకుండా, కేవలం సాత్వికంగా ఉండటమే ధర్మమని భ్రమించటం ఈ బలహీనతకు కారణం. ఈ మనోదౌర్బల్యం భారతజాతిని పురాణకాలంలో కానీయండి, ఇతిహాసకాలంలో కానీయండి, తదనంతర కాలంలో కానీయండి పూర్తిగా ప్రభావితం చేసింది. జాతిని క్రమంగా నిర్వీర్యం చేసింది.

సత్యవాక్పరిపాలన, పితృవాక్యపరిపాలన, క్షమాగుణం, అడిగినవారికి లేదనకుండా, కాదనకుండా విచక్షణ లేకుండా ఏది అడిగితే అది ఇచ్చేయడం ..ఇత్యాది చర్యలన్నీ ధర్మాలుగా భారతజాతిలో అనాదిగా చలామణీ అవుతూ వస్తున్నాయి. శరణన్నవాడికి అవతలి వాడి బలమేమిటో తెలుసుకోకుండా అభయమివ్వటం, ఓడిపోయి క్షమించమనగానే వాడెంతటి ప్రమాదకర శత్రువో అని ఆలోచించకుండా వాడిని క్షమించి వదలి వేయటం, వాడిని సరిహద్దులవరకూ సగౌరవంగా, మరే ఇతర రాజూ వాడి మీద దాడి చేయకుండా రక్షణ కల్పించి మరీ సాగనంపటం.. ఇత్యాది మతిమాలిన చర్యలన్నింటినీ భారతజాతి గొప్ప ఆదర్శాలుగా భావిస్తూ, వాటిని ఆచరిస్తూ వచ్చింది. చాణక్యుడు, శివాజీ లాంటి ఒకరిద్దరు రాజనీతి వేత్తలు తప్ప మిగతా వారంతా ఈ ధోరణిలోనే ప్రవర్తించారు. ఇటువంటి ధోరణి వలనే భారతజాతి రాజనీతికి దూరమై, నిర్వీర్యమై పరులకు బానిసై పతనమయ్యింది.

ఈ విధమైన మనోదౌర్బల్యం కేవలం ఎదుటివాడి యెడల మెతక తనాన్ని ప్రదర్శించడం తోటే ఆగిపోలేదు. మన జీవితంలోని అనేక అంశాలమీద దీని ప్రభావం ప్రసరించింది. ఎదుటివారి నుండి మనకు రావలసినది రాబట్టుకోక పోవడం, విచక్షణా రహితంగా అల్పులను కూడా గౌరవించడం, నిరాడంబరత పేరుతో ఐహిక సమృద్ధిని సాధించటానికి కృషి చేయకపోవటం, శక్తి ఉండి కూడా రాజ్యవిస్తరణ చేయక పోవటం, సంపద మీద, భోగాల యెడల దిక్కుమాలిన విముఖత చూపడం… సాధారణ ప్రజల్లోనైతే ఈ ధోరణి నిరాసక్తంగా, నిర్లిప్తంగా జీవించేయటం, శుచి, శుభ్రత లేకుండా ఉండటం, విద్యార్జన చేయక పోవటం, మూఢనమ్మకాలు, గుడ్డిగా ఇతరుల మీద ఆధారపడటం, ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయటం, ఏదో నాలుగు తిండి గింజలతో పొట్ట నింపుకోవటం, ఎదుగూ బొదుగూ లేకుండా జీవించటం.. ఇలా ఈ సాత్విక ధోరణి భారత జాతీయ జీవన విధానాన్ని నిస్సారం చేసేసింది.

పురాణకాలంలో, జాతీయ మనస్తత్త్వ పరిణామక్రమం కొనసాగుతున్నందున, అది జ్ఞాన బోధకు ఇంకా అర్హత సంపాదించనందున ఈ ధోరణిని భారత జాతిలోని ఏ తపస్వీ, ఏ జ్ఞానీ ఖండించలేదు. అసలు విషయం బోధించలేదు. ఈ జాతి ఆ అర్హత పొందిన ద్వాపర యుగాంతానికి తత్ విషయ బోధనకై శ్రీకృష్ణుడు అవతరించాడు. మహాభారత యుద్ధం జరగబోయే కురుక్షేత్రంలో యుద్ధానికి ముందు భారతజాతి యొక్క సారజనీన బలహీనతైన సాత్విక ప్రవర్తనే సత్యమనే ధోరణికి అర్జునుడు లోనయ్యాడు. దాని ప్రభావంతో రాజ్యం కోసం స్వజనులను చంపుకోవటం పాపమనీ, అంతకన్నా బిచ్చమెత్తుకోవటమే మేలనీ భావించాడు. ధుర్యోధనాదులు తమకు పెట్టిన బాధలను, వారి వల్ల తాము పొందిన కష్టనష్టాలను మరచిపోయి వారిని క్షమించటమే మంచిదనే నిర్ణయానికి వచ్చాడు. వారి యెడల కరుణ చూపి వారు తమ నుండి అన్యాయంగా కాజేసిన రాజ్యాన్ని వారికే వదలడం ఆదర్శవంతమైన ప్రవర్తన అనే నిర్ణయానికి వచ్చాడు. అదే విషయాన్ని శ్రీకృష్ణునితో అన్నాడు.

జాతీయ బలహీనతకు ప్రతినిథిలా నిలచిన అర్జునుడి వాదనను శ్రీ కృష్ణుడు పూర్తిగా ఖండించాడు. అతని పలుకులు చిలుక పలుకులన్నాడు. ఇది నపుంసకులకు చెల్లే మాటలు కానీ అర్జునుడు వంటి వీరాధివీరునకు చెల్లే మాటలు కావన్నాడు. అర్జునుడి ధోరణిని గొప్ప ఆదర్శంగా జాతి మొత్తం తలకెత్తుకుంటున్న కాలంలో కృష్ణుడు గొప్ప సాహసంతో, మరెంతో జ్ఞానంతో ఆ ధోరణిని ఒక్క పెట్టున ఖండించి వేశాడు. సాత్విక మైన కర్మ ఆదర్శం కాజాలదనీ, అసలైన ఆదర్శవంతమైన కర్మ ఎటువంటిదో, మనిషి అనుసరించదగిన కర్మ విధానమెటువంటిదో అర్జునుడికి (తద్వారా మన జాతి మొత్తానికీ) గీతారూపంలో బోధించాడు.

నిరంతరం సాత్వికమైన కర్మలు ఆచరించటం ఆదర్శం కాదు, సందర్భౌచిత్యాన్ననుసరించి సాత్విక కర్మలతోబాటు రాజస, తామస కర్మలను కూడా ఆచరించటమే సత్యమార్గమనీ, మనిషి ఆదర్శంగా ఉండాలనే ఆరాటాన్ని కూడా విడనాడి కేవలం నిష్కామంగా కర్మలాచరించాలనీ, అప్పుడే సత్యమార్గ జీవనం సాధ్యమవుతుందనీ బోధించాడు. అలా బోధించడమే కాక, కురుక్షేత్ర రణరంగంలో ఆచరణాత్మకంగా కూడా సత్యమార్గమంటే ఎలాఉంటుందో చూపించాడు. ధర్మరాజు చేత అబద్దమాడించాడు. యుద్ధ నియమాలకు విరుద్ధంగా భీముని చేత ధుర్యోధనుని తొడల మీద గదతో మోదించి చంపించాడు. శిఖండిని అడ్డుపెట్టుకుని భీష్ముడినీ, రథచక్రం నేలలో క్రుంగి, నిరాయుధుడై ఉన్న కర్ణుడుని అర్జునుడి చేతా చంపించాడు. ఈ చర్యలన్నీ భారతజాతి సంప్రదాయ ఆలోచనా విధానాన్ననుసరించి, సాధారణ మానవుల ఆలోచనా ధోరణిని అనుసరించి అన్యాయ పూరితమైన చర్యలు. కానీ సత్య మార్గమంటే పైకి సాత్వికంగా కనిపించేదే కాదనీ, ఇలా కూడా ఉంటుందనీ నిరూపించటానికే శ్రీకృష్ణుడు ఇవన్నీ చేయించాడు. (అబద్ధం రాజస కర్మ. యుద్ధం తామస కర్మ.)

పాండవుల చేత చేయించడమే కాదు ..తాను సైతం ఇలాంటి కర్మలు ఆచరించాడు. జరాసంధుని చేతిలో ఓడిపోయి మధుర నుండి శాశ్వతంగా, సపరివారంగా ద్వారకకు పారిపోయాడు. తరువాత జరాసంధుడిని భీముని చేత చంపించాడు. కాలయవనుని చేతిలో ఓడిపోయి పారిపోతున్నట్లు నటించి గుహలో దూరి అక్కడ నిద్రిస్తున్న ముచికుందుని చేత అతడిని చంపించాడు. సాధారణ మానవుల దృష్టిలో పారిపోవడం పిరికి పందల లక్షణం. కానీ యుద్ధంలో దుష్టుడైన శత్రువును గెలవటం, అతడిని మట్టుబెట్టటం ముఖ్యం. అంతే కానీ పారిపోయామా లేక రొమ్మెదురొడ్డి పోరాడామా అన్నది కాదు. కృష్ణుడు పారిపోయి కూడా గెలిచాడు. అదీ కృష్ణతత్త్వం! అదీ సరైన కర్మా చరణ అంటే!

శ్రీ కృష్ణుడు ఇంత వివరణాత్మకంగా గీతా రూపంలో బోధగా, తదుపరి కురుక్షేత్ర రణరంగంలో ఆచరణాత్మకంగా సత్యమార్గ కర్మ విధానాన్ని వివరించినా దానిని భారతజాతి అవగాహన చేసుకొనకుండా ‘సాత్విక ప్రవర్తనే సత్యం’ అనే భ్రమలోనే ఉండిపోయింది. భారతజాతి బలహీనత యొక్క తాత్త్విక నేపథ్యం ఇదే. ఈ బలహీనతను ఆసరాగా చేసుకునే విదేశీయులు మనల్ని జయించారు. ఈ బలహీనతవల్లే స్వతంత్రులమైనా కూడా అభివృద్ధిని సాధించలేక ప్రపంచ దేశాలలో చాలా రంగాలలో వెనుకబడి పోయాము.

భారతజాతి ఈ ధోరణిని విడనాడి తన మనసును బలోపేతం చేసుకొని సత్యకర్మ అంటే సాత్విక ప్రవర్తన ఒక్కటే కాదనీ, సాత్విక, రాజస, తామస కర్మల మేలు కలయిక అని గుర్తెరిగి, తదనుగుణంగా ప్రవర్తించి ప్రపంచదేశాలలో ప్రాబల్యాన్ని సాధించడానికి మనమంతా కృష్ణతత్త్వాన్ని ముందుగా మన వ్యక్తిగత జీవితాలలో ఆచరించడానికి ప్రయత్నిద్దాం!

19 comments:

  1. manchi vishayame rasaru.kani ippudu manam maramu anukutunnanu.

    ReplyDelete
  2. సంగ్దిధావస్థలో పడ వేశారు. ఈ పద్దతి మీకేమన్నా న్యాయమా!!

    ReplyDelete
  3. @సుభద్ర గారు, మనం తప్పకుండా మారతాము. మన జాతి పునర్వైభవం సంతరించుకునే క్రమంలో ఆ మార్పు తప్పకుండా వస్తుంది.

    @దుర్గేశ్వర గారు, ధన్యవాదాలు!

    @చక్రవర్తి గారు, మీ సందిగ్ధకు కారణం? నేను చెడును ప్రోత్సహించడం లేదు. కేవలం రాజస కర్మలో లేక కేవలం తామస కర్మలో గనుక ఆచరిస్తే అది ఖచ్చితంగా చెడుకే దారితీస్తుంది.

    అలా అని మంచిగా ఉంటున్నాం అనే పేరుతో కేవలం సాత్విక కర్మలను మాత్రమే ఆచరిస్తే అది మన బలహీనతకే దారి తీస్తుంది. అందుకే తగిన మోతాదులో మూడింటినీ కలిపి ఆచరించాలి. అదే నేను చెప్పినది.

    ReplyDelete
  4. hello Saraswathi Kumar gaaru, Can you send me your email ID to my address srapelli@yahoo.com. So we will can share our thoughts.

    Dr. Sridhar Rapelli, New York, USA

    ReplyDelete
  5. Sridhar gaaru! My mail ID is available at my profile page. Thank you!

    ReplyDelete
  6. సరస్వతి కుమార్ గారు! సత్వరజోతమో గుణములు ప్రతి జీవి యందు మరుగుపడి వున్నవి. వాటి హెచ్చుతగ్గులచే అనేక రకాల కర్మలు చేయబడుచున్నవి. పూర్తి రాజస కర్మలో, పూర్తి తామస కర్మలో, పూర్తి సాత్విక కర్మలో అసాధ్యం. అయినా వారి వారి పూర్వ జన్మ కర్మానుసారముగా బుద్ధి పుట్టి పనులు చేయుచున్నారు మానవులు. కనుక వారి యొక్క స్థితిగతులకు పూర్వోత్తర కర్మలే కారణము. జన్మపరంపరలకు కూడా కర్మయే కారణము. కనుక జననమరణ భ్రాంతి రహితము కొఱకు కర్మాకర్మల రహస్యమును నిజ గురువులచే తెలిసికొని నైష్కర్మ్య సిద్ధిని పొందాల్సి వుంటుంది అని తెలియ చేయుచున్నాను.

    ReplyDelete
  7. hi, plz visit my blog

    gsystime.blogspot.com

    spiritual and universal knowledge

    thanks
    nagaraju g

    ReplyDelete
  8. నాగరాజు గారూ! మీ బ్లాగు నే చూశాను. కొన్ని టపాలు చదివాను. ధన్యవాదాలు!

    ReplyDelete
  9. అదే సమయంలో దుర్యోధనుడు దేనికి ప్రతినిధి అయ్యాడు..అతనూ ఆ జాతిలోని వాడే కదా!!

    ఇది స్వార్ధానికి(అధర్మం) కర్తవ్యానికి(ధర్మం) మధ్య సంగ్రామం.
    కృష్ణుడు నిరసించింది కర్మ చేయకుండా వుండటం, కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా వుండటం అనే మానసిక దౌర్భల్యాన్నేమో అని నా అభిప్రాయం. అంటే అతను ధర్మాన్నే ప్రతిపాదించాడు. అదే కృష్ణుడు, కుచేలుడు దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నా అతన్ని కరుణించలేదు. తనంతట తాను కృష్ణుణ్ని చూచి తన దగ్గరున్న అటుకులు సమర్పించాకనే అతనికి సంపదలు అనుగ్రహించాడు - కర్మని మనంతట మనమే తొలగించుకునే ప్రయత్నం చేస్తే భగవంతుడు మనకి సహాయం చేస్తాడు, అంటే కృష్ణుడు బోధించింది కర్తవ్య నిర్వహణ + స్వీయ ప్రయత్నం. కృష్ణుడు సమదృష్టి కలవాడు పేదవాడైన కుచేలుడు, బ్రహ్మ ఙ్ఞానులైన ఋషులు తన ఇంటికి వస్తే వారి పాదాలను స్వయంగా కడుగుతాడు. ఆయనకి ఎవరి పట్ల రాగంకానీ, ద్వేషంగానీ లేవు. ఎన్నో సుగుణాలు కలిగినవాడు కాబట్టి భోగాలు అతన్ని చలింపజేయలేదు. లోపలున్న శత్రువుల్ని ఒక్కర్ని కూడా జయించని వాడికి భోగభాగ్యాలు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయే తప్ప అవి ఏవిధమైన మేలూ చేయవు. జయించవలసిన వాటిని జయించకుండా అనుభవించాల్సిన వాటి కోసం అర్రులు చాచడం ఏవిధమైన ధర్మం?

    పాశ్చాత్య నాగరికత ప్రభావాన్ని తట్టుకుని, మత సంస్థల ప్రలోభాలను తట్టుకుని, మత యుద్ధాల తాకిడిని తట్టుకుని - శిరస్సు ఎత్తి నిలబడిన జాతిది దౌర్భల్యమా? భౌతికమైన సిరిసంపదలు క్షణికాలని, వున్నదానితో సరిపెట్టుకుని కలోగంజో తాగి తృప్తిగా బ్రతకడం గొప్పదనే లక్షణం కలిగిన జాతి దుర్భలమైనదా? అంతులేని సంపద, విద్య, అప్పటికి అధునాతన యుద్ధసామాగ్రి కలిగిన బ్రిటీష్‌ పాలకుల్ని అహింసతో జయించగలగడం అనే అసాధారణ కార్యం - "మీసమున్న మరో జాతి ఏదైనా సాధించగలదా?"జీసెస్‌, మహమ్మద్‌ ఇక్కడికి వస్తే మా మతంలోని దేవుళ్లే అవుతారు అనే పరమత సహనం కలిగిన జాతి ఈ భూమ్మీది గతంలో వుందా?? భవిష్యత్తులో ఉద్భవిస్తుందా? వాక్పటిమతో, అపారమైన మేధస్సుతో ప్రపంచ మత ప్రతినిధులని, ప్రచారకులని - సాధారణ శ్రోతల్ని చేసిన ధీరుడెవడున్నాడీ లోకంలో? భారతీయుడు తప్ప. ఇంతటి వీర్యమున్న జాతి మరొకటి ఈ భూమిపై ఉందా?.....ఏ విధంగా?? ఇతరులు సాముహికంగా చేసే పని - భారతీయుడొక్కడు చేసి చూపించగలడు.

    పేటెంట్ల పట్ల ఆసక్తి లేకపోనీ... మత ప్రచారం పట్ల ఉదాసీనంగా వుండనీ...పరపీడనని సహించని.....జాతిని, మతాన్ని, కులాన్ని హీనంగా చూడనీ - ఇలాంటి వాటి పట్ల భారతీయులెన్నడూ స్పందించరు..... కర్తవ్యం నిర్వహించడంలో భారతీయుడికి సాటెవడూ లేడు.....సత్యాన్ని చెట్టులోనూ, పుట్టులోను చూస్తున్న వాడిని, అఙ్ఞానులు హేళన చేయవచ్చుగాక - సత్యం వుంది. అది చూడగలదు..వినగలదు...అవసరమైతే సమయానుకూలంగా స్పందించగలదు. ఇదీ భరతజాతి నమ్మే తత్త్వం.

    ReplyDelete
    Replies
    1. శరణాగతి భారతీయుడికి పుట్టుకుతో అబ్బిన లక్షణం. దాన్ని అవలక్షణంగా భావించడం పొరపాటు.

      Delete
  10. ఆదిత్య చౌదరి గారూ!

    నేను రాసిన విషయాలను శ్రద్ధగా చదివినందుకు ధన్యవాదాలు!

    ప్రతీ జాతీ తనకే విశిష్టమైన ఒక లక్షణాన్ని కలిగి ఉంటుది. అంతమాత్రం చేత ఆ జాతిలో జనించే ప్రతీ ఒకరూ ఆ లక్షణాన్ని కలిగి ఉండరు.

    అర్జునుడు కర్తవ్యాన్ని నిరాకరించినది ధర్మసంకటంతోనే తప్ప కర్మ చేయకుండా ఉండాలని కాదు.

    మీకు భారత జాతిమీద ఎంత భక్తి గౌరవాలూ, అభిమానమూ ఉన్నాయో నాకు కూడ అంతే ఉన్నాయి.అయితే ఒక జాతికి స్వభావ సిద్ధంగా ఎంత ఉన్నతలక్షణాలైనా ఉండనీ అవి ఆ జాతి ప్రాబల్యానికీ, వైభవానికీ అక్కరకు రానపుడు ఆజాతిలో సరిదిద్దుకోవలసిన లోపాలు ఉన్నాట్లుగా భావించక తప్పదు. ఇతరులు చేసే దాడులను తట్టుకొని నిలబడటం, ఇతరులు చేసే అవమానాలను దిగమ్రింగుకోవడం, ఇతరుల ప్రలోభానికి, ప్రచార పటాటోపాలకూ ప్రభావితం కాకుండా ఉండటం... ఇటువంటి లక్షణాలు మంచివే అయినా కూడా అవి ఆత్మరక్షణాత్మకమైన పద్దతులే తప్ప మన జాతి వైభవానికి కారకమయ్యే లక్షణాలెంతమాత్రం కాదు.

    ReplyDelete
  11. ఉత్థాన పతనాలు ప్రతిచోట వున్నవే...పతనం అవుతుండగా చూచి మనం నాశనం అవుతుందనుకుంటాం. పతనం ఎప్పుడూ అభివృద్ధికి పునాది. పతనమైనప్పుడే తనలో లోపాలు తెలుస్తాయి. ఇలా లోపాలు తెలియని, సవరించుకోని జాతులెన్నో అంతరించిపో(తా)యాయి.

    ReplyDelete
  12. ఎవరు స్పందించాలో వారు మాత్రమే స్పందించే వ్యవస్థ మన సొంతం.( పతనంలో భాగంగా అది ఇప్పుడు గాడి తప్పింది) అలా కాక పనికొచ్చేవాడు, పనికిరాని వాడు స్పందిస్తే వ్యవస్థలు నాశనమవుతాయి. మూకుమ్మడిగా స్పందించకుండా వుండాల్సిన ఆవశ్యకతని గుర్తించే వికేంద్రీకృత వ్యవస్థని కులాలుగాను, వర్ణాలుగాను విభజించారు. వర్ణం కులం ఒకటి కాదు. కులం మారదు..వర్ణం మార్చుకోవచ్చు తపస్సు ద్వారా....రాజర్షి ఐన విశ్వామిత్రుడు తప్పస్సు చేత తన శరీరాన్ని తపించి బ్రహ్మర్షి ఐనట్టు....కాని ఇప్పుడు కులానికి, వర్ణానికి భేదం లేదు..రెండు ఒకటే - కలిపేశారు....ఎలా అంటే రావణుడికి పదితలలు పెట్టినట్టు. రావణుణ్ని దశకంఠుడు అన్నారు కంఠం అంటే గొంతు, సంగీతం అని అర్ధం. బ్రహ్మ చతుర్ముఖుడు నాలుగు తలలు గలవాడని అర్ధం. దశనాధం పలికించగలవాడు కాబట్టి రావణుడు గొప్ప సంగీతవేత్త కాబట్టి అతన్ని అలా అన్నారు. మనం చక్కగా పది తలలు పెట్టి టపాసులు కాల్చేస్తాం......ఈ పది తలలు అనవసరంగా పుస్తకాలు చదివి రాసేవాళ్ళ వల్ల పుట్టినవి. అంటే ఎవడు స్పందించాలో వాడు స్పందించకపోతే జరిగే అనర్ధాలకు అంతులేదు.

    ReplyDelete
  13. అనవసరంగా చదివి రాయడం అనడంలో అర్ధం వుంది.
    ఎందుకు చదవాలో తెలియక చదివేసి - విషయంపై అవగాహన రాకుండా విపరీతంగా అలోచించి - లోతైన అర్ధాలు తెలీక రాసేసి - తమ అర్ధం పర్ధంలేని రాతలతో జనాల్ని చావగొడుతున్నారు.

    కొందరు - అనవసరంగా చదివేసి - ఇంట్లో కూర్చుని..వాదాల పేరుతో జనాల్ని రెచ్చగొడతారు. వీడింట్లో బ్రూకాఫీ తాగి పడుకుని - పక్కింటోడు భగత్‌సింగ్ అవ్వాలి...నేను ప్రేరణ జాతికి చెందిన రచయిత అంటాడు, చదివి సమాజానికి వీడు చేసే మేలు లేకపోగా - చీడ పురుగులా తయారయ్యి - తన చీదర రాతల్తో ఇంకొన్ని చీడ పురుగుల్ని ఉత్పత్తి చేస్తాడు.

    వ్యవస్థలో ఇవన్నీ సాధారణం మరి.

    ReplyDelete
    Replies
    1. ఈ వ్యాఖ్య నా అభిప్రాయం తెలియజేస్తూ చేసిందే తప్ప..
      వ్యక్తిగత దూషణ కాదని వివరణ ఇస్తున్నాను.
      ఇవి కేవలం గతంలో నేను చదివిన ఇతరుల రచనల పట్ల నా అభిప్రాయం.

      మీ వ్యాసాలు నచ్చి - స్పందిస్తున్నా ...

      Delete
  14. వేప జాతి చెట్లు - అన్నీ చేదనే లక్షణాన్ని కలిగివున్నట్లే
    ప్రతి జాతి తన జాతి లక్షణాన్ని కలిగివుంటుంది.
    వేప చెట్లు ఎదుగుదలలో వైవిధ్యం వల్ల ఒకదానికొకటి భిన్నంగా వుంటాయి.
    కానీ జాతిగా అవెప్పుడూ ఒకటే కాదంటారా?

    అర్జునుడు ఆత్మఙ్ఞానం లేకపోవడం చేత తన గురువైన కృష్ణుడుకి శరణాగతి అయ్యాడు -
    ధర్మ సంకంటంలో వున్నాడు అనడంకన్నా... అతను వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనసు వికలం అయ్యింది. కృష్ణా! నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు. నేను యుద్ధం చేయను. నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు - అని ప్రార్ధించిన, అతను - కర్తవ్య విమూఢుడయ్యాడనడం మరింత సముచితం.

    ReplyDelete
  15. జాతి లక్షణం అరుదైన సందర్భాల్లో వ్యక్తిలో మరుగు పడవచ్చు అనడంలో - నేను మీతో ఏకీభవిస్తాను.

    ReplyDelete
  16. మన జాతి ప్రస్తుతం శరణాగతి ఎవరికి చెయ్యాలో తెలియని దుస్థితిలో వుంది.
    గురువే జాతికి శరణ్యం - గురువు ఏ ఇతర దేవతకన్నా కూడా అధికుడు.
    గురువు విశ్వనియంత. పరిపాలకుడు. పోషకుడు.

    ReplyDelete